నన్ను కూడా ఇరికించాలని చాలా ట్రై చేశారు... వాళ్ల వల్ల కాలేదు: జగ్గారెడ్డి
- రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్
- బీజేపీ నేతల వ్యాఖ్యలకు విలువ లేదని మండిపాటు
- అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న సీఎంను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతల ఆరోపణలకు ఎలాంటి విలువ లేదని కొట్టిపారేశారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, అది జీర్ణించుకోలేకనే బీజేపీ నేతలు ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న భూ దందాల ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. గతంలో తనపై కూడా ఇలాంటి ఆరోపణలు చేశారని, అయితే ఎలాంటి ఆధారాలు చూపించేకపోయారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత కూడా తనను ఎక్కడో ఒకచోట ఇరికించాలని తెగ ట్రై చేశారని... కానీ, సాధ్యం కాకపోవడంతో చాలా నిరాశ చెందారని అన్నారు.
సమస్యల ప్రాతిపదికన చర్చించకుండా కేవలం బురదజల్లడమే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం రాష్ట్ర ప్రయోజనాల కోసమని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు అండగా ఉంటాయని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు.